సాయి సత్ చరిత్రము

మూడవ అధ్యాయము

Shri Sai Satcharitra - Chapter 3

ఓం శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము

మూడవ అధ్యాయము


సాయిబాబా యనుమతియు వాగ్ధానము, భక్తులకొరకు నిర్ణయించిన పని, - బాబా కథలు సముద్రమధ్యమున దీపస్తంభములు - వారి ప్రేమ, రోహిల్లా కథ - వారి మృదుమధురమైనట్టియు యమృతతుల్యమైనట్టియు పల్కులు.

సాయిబాబా యొక్క యనుమతియు వాగ్దానమును

వెనుకటి యధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సత్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి యనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. "సత్చరిత్ర వ్రాయువిషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదను. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య నిష్క్రమించి పోవును. వానిని శ్రద్ధాభక్తులతో నెవరు వినెదరో వారకి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును."

ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండేవైపు తిరిగి బాబా యిట్లనెను.

"నా నామము ప్రేమతో నుచ్చరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులయితే మనఃపూర్వకముగా నాపై నాధారపడియున్నారో వారీ కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలు పాడువారి కంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరయితే శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా యాకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనములనుండి తప్పించుట నా ముఖ్యలక్షణము. ప్రపంచములోని వానినన్నిటిని మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమున మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తిశ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకముగలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును."

భక్తులకు వేర్వేరు పనులు నియమించుట

భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నదివొడ్డున మెట్లు, మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. నన్నీ సత్చరిత్ర వ్రాయుమని నియమించిరి. అన్ని విషయములు పూర్తిగా తెలియనివాడనగుటచే, ఈ పనికి నాకు అర్హత లేదు. అయితే యింత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయియెక్క కరుణయే యంత కఠినమైన పని యొనర్చు శక్తిని ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా యహంకారమును పెరికివేసి వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు గాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని శ్రుతి స్మృతి యను రెండు కండ్లు లేకుండుటచే సాయి సత్చరిత్రను వ్రాయలేకుంటిని. కాని భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును; కుంటివానిని పర్వతములు దాటునట్లు చేయును. తన యిచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే యా చాతుర్యము కలదు. హార్మోనియమునకుగాని వేణువునకుగాని ధ్వనులు ఎట్లువచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియును. చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వానివల్ల జరుగదు. కాని చంద్రోదయమువల్ల జరుగును.

బాబా కథలు దీపస్తంభములు

సముద్రమథ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురువల్ల రాళ్ళురప్పలవల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు. ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతముకంటె తియ్యగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను, సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవులద్వారా హృదయమందు ప్రవేశించునపుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వభావములును నిష్క్రమించును. అవి మన హృదయమందు నిల్వచేసినచో సందేహములు పటాపంచలయిపోవును. శరీరగర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి యివియే మోక్షమునకు సులభసాధనము. కృతయుగములో శమదమములు (అనగా నిశ్చలమనస్సు, శరీరము) త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణములవారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమలను పాడుట యతిసులభము. మనమనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుటవలన పాడుటవలన మనకు శరీరమందు గల యభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగ జేసి, తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సత్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగ చదువగలరు; వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసికొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తికలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది యాత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సత్చరితామృతమును వ్రాయుట తయారుచేయుట బాబాయొక్క కటాక్షముచేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడగనే యుంటిని.

సాయిబాబా యొక్క మాతృప్రేమ

ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో యందరికి తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడు నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసికొని సరిగాచేయును. బిడ్డకు ఈ విషయమేమియు తెలియదుగాని తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి యలంకరింపబడుట చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చ దగిన దేదియు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము. సద్గురువులు కూడ నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు గూడ నాయందట్టి ప్రేమ యుండెను. దానికీ క్రింది యుదాహరణ మొకటి.

1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగమునుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురుపౌర్ణమినాడు ఇతర భక్తులతో నేను కూడ షిరిడీ పోయితిని. అణ్ణాచించణీకర్ నాగురించి బాబాతో నిట్లనెను. "దయచేసి వానియందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైన ఉద్యోగ మిప్పించుము. వాని యాతురుతను తీసివేయుము. వానికానందము కలుగునట్లు చేయుము". అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను. "వాని కింకొక ఉద్యోగము దొరుకును, కాని వాడిప్పుడు నా సేవలో తృప్తిపడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగనే యుండును. ఎన్నటికిని నిండుకొనవు. వాని దృష్టి నంతటిని నావైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరియెడ అణకువ, నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగ పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును."

నన్ను పూజింపుడను దానిలోని ఈ 'నన్ను' ఎవరు? అను ప్రశ్నకు సమాధానము 'సాయిబాబా యెవరు' అను దానిలో విశదీకరింపబడి యున్నది. మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు.

రోహిల్లా కథ

రోహిల్లాకథ విన్నచో బాబా ప్రేమ యెట్టిదో బోధపడును. పొడుగాటివాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడునగు రోహిల్లా యొకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిరనివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు "అల్లాహు అక్బర్" యని యాంబోతు రంకెవేయునట్లు బిగ్గరగా నరచుచుండెను. పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి యింటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళవరకు వారు దీని నోర్చుకొనిరి. తుదకు బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరపుల నాపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయేకాక వారిపై కోపించి వారిపనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్యగలదనియు, ఆమె గయ్యాళి యనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టుననియు బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యయేలేదు. భార్యయనగా దుర్భుద్ధియని బాబా యభిప్రాయము. బాబాకు అన్నింటికంటె దైవప్రార్థనలందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి, ఊరిలోనివారి నోపికతో నోర్చుకొని బాధను సహింపవలసినదనియు నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధిచెప్పెను.

బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు

ఒకనాడు మధ్యాహ్నహారతి యయిన పిమ్మట భక్తులందరు తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు బాబా యీ క్రింది చక్కని యుపదేశమిచ్చిరి.

“మీ రెక్కడ నున్నప్పటికి నేమి చేసినప్పటికి నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించు వాడను; అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టిస్థితిలయకారకుడను నేనే. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారిని మాయ శిక్షించదు. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే.”

ఈ చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో నెవరి సేవ చేయక గురుసేవయే చేయుటకు నిశ్చయించితిని. కాని అణ్ణాచించణీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా యని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరకెను. కాని అది కొద్దికాలము వరకే. అటుపిమ్మట వేరే పనియేదియు చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని.

ఈ యధ్యాయము ముగించకముందు, చదువరులకు నేను చెప్పునదేమన, బద్ధకము, నిద్ర, చంచలమనస్సు, శరీరమందభిమానము మొదలగు వానిని విడిచి, వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురు గాక. ఇతర మార్గములవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రొక్కుదురు గాక. అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి యజ్ఞానమును నశింపజేయును; మోక్షమును సంపాదించి పెట్టును. లోభియెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు, బాబాను కూడ నెల్లవారు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
మూడవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।